కోల్కతా: భారత దేశంలో కూడా కోవిడ్-19 బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం కోలకతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి నోవల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోలకతా చేరుకున్న ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారించినట్లు విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం తెలిపారు. దీంతో కోల్కతాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది.
మంగళ, బుధవారాల్లో కోలకతా విమానాశ్రయంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ ఇద్దరు ప్రయాణికులకు నిర్ధారిత పరీక్షలో పాజిటివ్ వచ్చిందని విమానాశ్రయం డైరెక్టర్ కౌశిక్ భట్టాచార్జీ పీటీఐకి తెలిపారు. వీరిద్దరినీ బెలియాఘాటా ఐడి ఆసుపత్రికి పంపినట్లు తెలిపారు. అంతకుముందు అనితా ఒరాన్ అనే ప్రయాణీకుడికి కూడా థర్మల్ స్కానింగ్ సమయంలో పాజిటివ్ వచ్చినట్టు భట్టాచార్జీ చెప్పారు. మరోవైపు స్పైస్జెట్ విమానంలో బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని కరోనా వైరస్ బాధితుడుగా అనుమానిస్తూ, పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే కోల్కతా, చైనా మధ్య ప్రత్యక్ష విమానాలను కలిగి ఉన్న రెండు విమానయాన సంస్థలు తమ విమాన సేవలనుతాత్కాలికంగా నిలిపివేసాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ఇండిగో ఫిబ్రవరి 6- 25, 2020 వరకు కోల్కతా- గ్వాంగ్జౌ మధ్య తన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో తరువాత, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 29 వరకు చైనాలోని కోల్కతా, కున్మింగ్ మధ్య విమానాలను నిలిపివేసింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ బ్యాంకాక్ నుండి కోల్కతాకు వచ్చే విమాన ప్రయాణికులను జనవరి 17 నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.